రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు..


తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది పకడ్బందీ చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా ‘కరోనా వైరస్‌’ దావానంలా విస్తరిస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల వద్ద నిఘా ఉంచి, వాహనదారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నైట్లెతే.. వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. 


కోటపల్లి మండలంలోని రాపనపల్లి గ్రామం సమీపంలో తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ రవి కుమార్‌, జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ పరిశీలించారు. అక్కడ నుంచి వచ్చి పోయే వాహనాలను పరిశీలించిన డీసీపీ.. వాహనదారులకు వైద్యపరీక్షలకు నిర్వహించాలని సూచించారు. ఎవరికైనా ఈ వైరస్‌ మహమ్మారి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షల నిమత్తం ఆస్పత్రికి తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు రూరల్‌ సీఐ నాగరాజు, మంచిర్యాల ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.