ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి ‘కరోనా వైరస్’ను దేశం నుంచి, రాష్ట్రం నుంచి తరిమికొడదామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో మంత్రి కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ను ప్రతి ఒక్కరూ పాటించాలనీ.. తద్వారా కరోనాను నివారించాలని మంత్రి వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఈ మహమ్మారి వైరస్ పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. సీంఎం సూచనలు పాటించి, వైరస్ను దరిచేరనీయరాదని మంత్రి వెల్లడించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసి, వ్యాధి లక్షణాలున్న బాధితులను జాగ్రత్తగా చూసుకుంటున్నారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారికే వ్యాధి లక్షణాలు ఉండడంతో, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి అన్నారు.
ఈ అవగాహన కార్యక్రమంలో మంత్రితో పాటు జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, స్థానిక శాసన సభ్యులు సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, కలెక్టర్ గగులోతు రవి, ఎస్పీ సింధు శర్మ, జేసీ రాజేశం, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, బుగ్గారం జెడ్పీటీసీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.